అర్ధరాత్రి అయినా, ఇంకా మెలకువగా ఉండటానికి కారణం స్వర్గీయ శ్రీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు. అవధానంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది. భాషాభిమాని, మంచి వక్త, కవి, రచయిత. ఆఫీసు వాళ్లతో క్రికెట్ ఆడి ఇంటికి వస్తున్న సమయంలో ఎందుకో ఆయన నా మనసుకు స్ఫురించారు. వెంటనే ఇంపాక్ట్ స్పీచ్ ఒకటి గుర్తుకు వచ్చి దాని కోసం వెతకడం ప్రారంభించాను. ఎంతకూ దొరక్కపోవడంతో... ఇంపాక్ట్ స్పీచ్ అవధానం అని టైప్ చేసే సరికి వారి వీడియోనే కంటపడింది. అలా ఆయన మాటలు వింటూ ఇంటికి చేరుకున్నాను. అలా వింటూ ఉండగా చార్జింగ్ అయిపోవడంతో ఆయన మాటలు కూడా ఆగిపోయాయి. సరే అని చెప్పి... ఫోన్ ఛార్జింగ్ పెట్టి నా పనుల్లో నేను మునిగిపోయాను. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
ఇంట్లో శ్రీమతి చేసిన రిక్వెస్ట్తో అంట్లు తోమేసి, కాసేపు సిస్టమ్ అలా ఆన్ చేద్దామని తలచి, ఆన్ చేశాను. కొద్దిసేపు అదీ, ఇదీ సెర్చ్ చేశాక.. గూగుల్ ప్రేరణతో సగంలో ఆపేసిన రాళ్లబండి వారి మాటలు పూర్తిగా విన్నాను. ఆ మాటల ప్రవాహం నన్ను గతంలోనూ ముంచెత్తింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈరోజు కూడా అదే రీతిగా నన్ను తట్టిలేపాయి. అలా అర్ధరాత్రి దాటినా ఆయనే మనసులో ఆలోచనల జడివాన కురిపిస్తున్నారు.
ఆయన్ను నేను తొలిసారి 2009లో చూశాను. పేపర్లో అష్టావధానం గురించి చదివిన నేను, అది ఉన్న చోటుకి వెళ్లాను. అక్కడ జనంలో ఓ మూలగా కూర్చుని రాళ్లబండి వారి అవధానం విన్నాను. అదే వారిని నేను తొలిసారి చూడటం. నా జీవితంలో ఓ ముఖ్యమైన మలుపునకు కారణమైన సందర్భం కూడా అదే. ఆ తర్వాత నాలుగైదేళ్లకు ఇంపాక్ట్ వీడియోలో చూడటం. దాన్ని నేను చూడటమేగాక మరికొంతమందికి కూడా పరిచయం చేశాను. అంతగా నాపై వారి మాటలు ప్రభావం చూపాయి.
ఆ తర్వాత రెండు మూడేళ్లకు వారు కాలం చేశారు. రాళ్లబండి గారు కాలం చేసిన రోజున నాకు చాలా బాధేసింది. ఇప్పటికీ ఆయన మాటలు వింటుంటే, వారి గొంతులోని మాధుర్యం, తెలుగు భాషపై ప్రేమ హృదయాన్ని తడుతున్నట్టే ఉంటాయి.
మీరూ వినండి. మిమ్మల్ని కూడా ఆయన నిద్రపోనివ్వరూ. మెలకువతో జ్ఞానాన్ని అందుకోమంటారు. సేవలో తరించమంటారు. జైహింద్.. జైతెలుగుతల్లి.. వందేమాతరం.